
- ట్రక్ షీట్తో రైతు, డ్రైవర్, సెంటర్ ఇన్చార్జి గ్రూప్ఫొటో కంపల్సరీ
- సెంటర్, డేట్, టైమ్ తో ‘నోట్ క్యామ్ యాప్’ లో అప్ లోడ్ చేయాల్సిందే
- ప్రతి సెంటర్కో ఫైల్.. ఫొటోతో సహా కొనుగోలు వివరాలు ఫీడ్
- పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సివిల్ సప్లయ్స్శాఖ
హైదరాబాద్ / యాదాద్రి, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగకుండా సివిల్ సప్లయ్స్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఇతర ప్రాంతాల వడ్లను.. లోకల్గా చూపించేందుకు మిల్లర్లు చేసే ప్రయత్నాలకూ అడ్డుకట్ట వేస్తున్నది. గతంలో మాదిరిగా దొంగ ట్రక్ షీట్లు రాసి గోల్మాల్ చేసేందుకు వీలులేకుండా ఈ సారి ‘నోట్ క్యామ్’ యాప్ను తీసుకొచ్చింది.
ధాన్యం లారీ దగ్గర ట్రక్ షీట్తో రైతు, డ్రైవర్, సెంటర్ ఇన్చార్జితో గ్రూప్ఫొటో తీసి.. సెంటర్, డేట్, టైమ్ తో యాప్లో అప్ లోడ్ చేయిస్తున్నది. ఫలితంగా ధాన్యం అమ్ముకున్న రైతులు ఇటు నిర్వాహకుల చేతిలో, అటు వ్యాపారుల చేతిలో మోసపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 56.49 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1.27 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సర్కారు అంచనా వేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 8,200 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ నిర్ణయించగా.. ఇప్పటికే 2వేల సెంటర్లకు పైగా ప్రారంభించారు. లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు.
యాప్తో అక్రమాలకు అడ్డుకట్ట ఇలా..
జియో ట్యాగింగ్ చేసిన లారీలో ధాన్యం బస్తాలను లోడ్ చేసి, బస్తాల సంఖ్యను ట్రక్ షీట్ లో నమోదు చేస్తారు. ఆ తర్వాత లారీ డ్రైవర్, కొనుగోలు సెంటర్ ఇన్చార్జ్, అందుబాటులో ఉన్న రైతుతో కలిసి ట్రక్ షీట్ తో ‘నోట్ క్యామ్ యాప్’ లో కొనుగోలు సెంటర్ పేరు, తేదీ, టైమ్ వచ్చేలా ఫొటోను దింపుతారు. ఆ ఫొటోను సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ హెడ్కు వాట్సాప్లో పంపిస్తారు. ఆ ఫొటోను వడ్ల కొనుగోలు సెంటర్ ఫైల్లో భద్రపరుస్తారు. ఇలా ఎన్ని లారీల్లో ఏఏ మిల్లుకు ఏ రోజు ఎన్ని బస్తాల వడ్లు పంపించారో ఆ ఫైల్స్లో వివరాలు ఫీడ్ చేస్తారు.
గతంలో ఇతర ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన వడ్లను ఇక్కడే కొన్నట్టుగా కొందరు అక్రమ మిల్లర్లు దొంగ ట్రక్ షీట్లు రూపొందించేవారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కై మద్దతు ధర పొందేవారు. అంతే కాకుండా తూకం తక్కువగా ఉందని, వడ్లు సరిగా లేవని కొర్రీలు పెట్టి లారీ లోడులో బస్తాలకు బస్తాలు కోత పెట్టేవారు. తాజాగా ‘నోట్ క్యామ్ యాప్’ లో సెంటర్ పేరు, తేదీ, టైమ్ వచ్చే విధంగా ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తుండడంతో.. అక్రమ వ్యవహారాలకు చెక్ పడుతున్నది. ఇక వడ్ల కొనుగోళ్లలో తూకంలో కోత పెట్టినా, కాంటా పెట్టకున్నా, రైతులకు కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా.. రైతులు నేరుగా ఫోన్ చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ 92814 23621 ను ఏర్పాటు చేశారు. సెంటర్లలో ధాన్యం కాంటా పెట్టిన తర్వాత బస్తాలకు రైతులకు ఇచ్చే టోకెన్ నంబర్లు వేస్తున్నారు.
అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు
వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నం. సెంటర్ నుంచి లారీ ఎప్పుడు.. ఏ మిల్లుకు బయలు దేరింది.. అన్లోడ్ ఎప్పుడు జరిగింది వెంటనే తెలుసుకుంటున్నం. మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా నోట్ క్యామ్ యాప్ ఉపయోగిస్తూ ఫొటోలు తీసుకుంటు న్నం. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినం. ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి స్టాఫ్ను ఏర్పాటు చేసినం.
- హరికృష్ణ, డీఎం,
సివిల్ సప్లయ్స్, యాదాద్రి జిల్లా