కోల్‎కతా జూనియర్ డాక్టర్ మర్డర్​ కేసు.. సీజేఐ బెంచ్ విచారణ

కోల్‎కతా జూనియర్ డాక్టర్ మర్డర్​ కేసు.. సీజేఐ బెంచ్ విచారణ

కోల్​కతా ఆర్జీ కర్ డాక్టర్ రేప్ అండ్​ మర్డర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. తాజాగా సోమవారం ఈ కేసును సీజేఐ బెంచ్​విచారించనుంది. ఈ బెంచ్‎లో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. గత నెల 22న ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. విచారణను వాయిదా వేసింది. కాగా, ఈ కేసుతో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలకు మమత సర్కారు సహకరించట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ జరపనుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. 

డాక్టర్‎పై దారుణం జరిగాక ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్​ వద్ద భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ బలగాలను పంపింది. అయితే, ఆ బలగాలకు మమత సర్కారు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని కేంద్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, మహిళా డాక్టర్‎పై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఆర్జీ కర్ డాక్టర్‎కు న్యాయం చేయాలంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.