మారుతున్న వాతావరణ పరిస్థితులపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని శనివారం సీజేఐ ఆవిష్కరించారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు మత్స్యకారులు, రైతులతో పాటు సమాజంలోని బలహీల వర్గాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పౌరులు ముందుకు రావాలని సీజేఐ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడో ఓచోట అకాల వర్షాలు వర్షాలు కురుస్తున్నాయన్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత నిన్న గోవాలో వర్షాలు కురిశాయని ఆయన గుర్తు చేశారు. నారాలి పౌర్ణమి రోజున మత్స్యకారులు సముద్రానికి కొబ్బరికాయలు సమర్పిస్తే వర్షాలు ముగుస్తాయని చిన్నప్పుడు చెప్పేవారన్నారు. కానీ ఇప్పుడు అక్టోబర్, డిసెంబర్లో కూడా వర్షాలు కురుస్తున్నాయన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ రాష్ట్రం పర్యావరణ పరిరక్షణ గురించి తెలుపుతుందని ఆయన అన్నారు. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని నిర్దేశిస్తుంది. ఆర్టికల్ 51A (g) ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని చెబుతుందన్నారు జస్టిస్ చంద్రచూడ్. ప్రకృతి గురించి పొందిన జ్ఞానాన్ని తరతరాలకు అందించడం, మనం గతంలోని పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన సీజేఐ సూచించారు.