ఫ్రెషర్స్ పార్టీలో స్టూడెంట్ల మధ్య ఘర్షణ

ఫ్రెషర్స్ పార్టీలో స్టూడెంట్ల మధ్య ఘర్షణ
  •     సీనియర్లు, జూనియర్లు  ఒకరిపై ఒకరు దాడి
  •     ఇద్దరు సీనియర్లకు తీవ్ర గాయాలు.. నలుగురు జూనియర్లపై కేసు
  •     సికింద్రాబాద్​ అవినాష్​ కామర్స్​ కాలేజీలో ఘటన

సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ లోని అవినాష్ కామర్స్ కాలేజీ ఫ్రెషర్స్​పార్టీ తీవ్ర ఘర్షణకు దారితీసింది. సీనియర్లు, జూనియర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్​కాలేజీ యాజమాన్యం గురువారం రాత్రి సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్​లో ఫ్రెషర్స్​పార్టీ ఏర్పాటు చేసింది. ఫస్ట్, సెకండ్​ఇయర్​స్టూడెంట్లు పాల్గొన్నారు. సీనియర్​స్టూడెంట్లు డ్యాన్స్​చేస్తుండగా, జూనియర్​స్టూడెంట్లు కొందరు తోశారు. ఈ క్రమంలో సీనియర్​స్టూడెంట్లు జూనియర్లను కొట్టారు.

యాజమాన్యం, మిగిలిన విద్యార్థులు వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ వెంటనే పార్టీని ముగించి అందరినీ ఇండ్లకు పంపించేశారు. బయటకు వెళ్లాక నలుగురు జూనియర్​స్టూడెంట్లు కర్రలతో సీనియర్లపై దాడికి దిగారు. ఇద్దరు సీనియర్​స్టూడెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణ పడుతున్న స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు.

గాయపడిన వారిని హాస్పిటల్​కు తరలించారు. నలుగురు జూనియర్లపై కేసు నమోదు చేసినట్లు బేగంపేట పోలీసులు తెలిపారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గొడవ జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. యాజమాన్య వైఖరిపై బాధిత తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని వాపోయారు.