
- సింధూ జలాల ఒప్పందం రద్దు
- కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు
- పహల్గాం టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన
- ప్రధాని అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ
- సెక్యూరిటీపై రెండున్నర గంటలపాటు చర్చ
- టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక
- ఇండియాను వీడాలని పాక్ హైకమిషన్ ఆఫీసర్లకు ఆదేశం..
- ఏప్రిల్ 22న ఆల్ పార్టీ మీటింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులు భారత్ నుంచి 48 గంటల్లో వెనక్కి పోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాఘా, అటారీ బార్డర్ను మూసేస్తున్నామని ప్రకటించింది. 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) అత్యవసరంగా సమావేశమైంది.
దేశ భద్రతపై రెండున్నర గంటలపాటు చర్చించింది. ఉగ్రవాదం పీచమణచాలని నిర్ణయించింది. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. టెర్రరిజాన్ని సహించేది లేదని, దాన్ని ప్రోత్సహించేవాళ్లను కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చింది.
ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రత్యేక వీసాదారులు ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్కు ఇచ్చే ప్రత్యేక వీసాలను క్యాన్సిల్ చేసింది. సార్క్ వీసా ఎగ్జెంప్షన్ స్కీమ్ (ఎస్వీఈఎస్) కింద పాకిస్తానీలను ఇండియాకు అనుమతించబోమని.. ఇప్పటికే ఈ వీసా కింద ఇండియాకు వచ్చినవాళ్లు 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందేనని కేంద్రం ఆదేశించింది.
ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఉన్న ఆ దేశ డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వయిజర్స్ను వారం రోజుల్లో వెనక్కి వెళ్లిపోవాలని.. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో ఉన్న మన డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వయిజర్స్ను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ఇరు దేశాల్లోని హైకమిషన్ స్టాఫ్ను 55 నుంచి 30కి కుదించింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
మోదీకి పరిస్థితిని వివరించిన అమిత్ షా
కేబినెట్ కమిటీ నిర్ణయాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వెల్లడించారు. టెర్రర్ అటాక్లో మృతిచెందిన వారికి కేబినెట్ నివాళులర్పించిందని, కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు బలంగా నమ్ముతున్నామని, టెర్రరిజాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కమిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ కూడా మెంబర్ అయినప్పటికీ ఆమె అమెరికా పర్యటనలో ఉండటంతో అటెండ్ కాలేదు. జమ్మూకాశ్మీర్లోని పరిస్థితిని మీటింగ్లో ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. మంగళవారం అటాక్ జరిగిన సమయంలో మోదీ సౌదీలో ఉన్నారు.
వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని అక్కడి నుంచే అమిత్ షాకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్ వెళ్లిన అమిత్ షా.. అక్కడి పరిస్థితులను పరిశీలించి, సీసీఎస్ మీటింగ్లో వివరించారు. కాగా, సౌదీ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని బుధవారం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ.. కేబినెట్కమిటీ అత్యవసర భేటీ నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు ఈ సమావేశంలో జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏప్రిల్ 24న ఆల్ పార్టీ మీటింగ్!
పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి.