ఎడ్యుకేషన్​ హబ్​గా పాలమూరు

ఎడ్యుకేషన్​ హబ్​గా పాలమూరు
  • ఎమ్మెల్యేలకు సీఎం హామీ

పాలమూరు/జడ్చర్ల టౌన్, వెలుగు: పాలమూరును ఎడ్యుకేషన్​ హబ్​గా తీర్చిదిద్దుతానని సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో కొత్తగా ఏర్పాటు చేయనున్న లా, ఇంజనీరింగ్​ కాలేజీలకు రెండు రోజుల కింద కేబినెట్​లో ఆమోదం లభించింది. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి క్లాస్లెస్​ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో పాలమూరు, జడ్చర్ల ఎమ్యెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​రెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్​ ఆదివారం ఉదయం సీఎంను హైదరాబాద్​లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే యెన్నం ‘మహబూబ్​నగర్  ఫస్ట్’​ కార్యక్రమం నవరత్నాలు గురించి  సీఎంకు వివరించారు. గవర్నమెంట్​ కాలేజీలో చదివే 200 మంది స్టూడెంట్లకు ఏటా ఫ్రీగా నీట్, ఇంజనీరింగ్​ ఎంట్రెన్స్  కోసం శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు.

 ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల ను రెవెన్యూ డివిజన్​గా మార్చాలని, బాలానగర్ ను మున్సిపాల్టీగా అప్​గ్రేడ్​ చేయాలని కోరారు. జడ్చర్లకు రైలు, రోడ్డు వసతులు ఉన్నాయని, జనాభా 4.5 లక్షల వరకు ఉందని తెలిపారు.ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్లు, మండలాల గురించి ఒక కమిటీ వేస్తామని, ఆ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.