- రాష్ట్రంలో దేశ్పాండే ఫౌండేషన్ సేవలు విస్తరించండి
- సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
- పాలమూరుఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, ఎంవీఎస్ కాలేజీని దత్తత తీసుకోవాలని సూచన
మహబూబ్నగర్, వెలుగు : రాష్ట్రంలోని కేజీబీవీల నిర్వహణలో భాగస్వాములు కావాలని దేశ్పాండే ఫౌండేషన్ సభ్యులను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో సంస్థ సేవలు విస్తరించడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశ్పాండే ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ఇంట్లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ సంస్థ అమెరికాతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం చేపట్టిన కార్యక్రమాలను ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీఎంకు వివరించారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే స్టూడెంట్లకు ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇవ్వడం, వారిలో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలను దత్తత తీసుకోవాలని సీఎం సూచించడంతో, వారు అంగీకరించారు. కాగా, మహిళా విద్యాభివృద్ధి, సమగ్ర అధ్యయనం కోసం ఈ నెల 6 నుంచి 8 వరకు కర్నాటక రాష్ట్రం హుబ్లీలో జరిగే కాన్ఫరెన్స్కు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి హాజరు కావాలని సీఎం సూచించారు. దేశ్పాండే ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురు రాజ్, జయశ్రీ, రాజు రెడ్డి, జి.అనిల్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం..
మహబూబ్నగర్ రూరల్ : మన్యంకొండ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం ఎనుముల రేవంత్రెడ్డికి మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన వారిలో మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్, ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.