
రూ.3 కోట్ల పంట పండించిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్కు చెందిన బాన్సువాడ రైతు మహిపాల్ రెడ్డి దంపతులను సీఎం కేసీఆర్ అభినందించారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో వచ్చిన మహిపాల్ రెడ్డి దంపతులు.. సెక్రటేరియట్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఇప్పటికే రూ.2 కోట్ల విలువైన టమాటా పంటను అమ్మామని, మరో రూ.కోటి విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్ రెడ్డి సీఎంకు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే సాగు లాభదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్కు టమాటాలతో కూడిన బోకేను రైతు దంపతులు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.