
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రం ఏర్పాటు కాకముందు ముస్లింలు ఎక్కువగా హోటళ్లలో కార్మికులుగా, మెకానిక్ షాపుల్లో పని చేసేవారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. ఖమ్మం సిటీలోని బీఆర్ఎస్ భవనంలో గురువారం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, సంభాని చంద్రశేఖర్, ఖమ్మం బీఆర్ఎస్అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ముస్లింల కోసం స్కూల్స్, కాలేజీలు నిర్మించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రూ.24 00 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తాను కేసీఆర్ను మహమ్మద్ ప్రవక్తతో పోల్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, కానీ తాను ఎప్పుడూ ఎక్కడా అలా అనలేదన్నారు ఒకవేళ అని ఉంటే క్షమించాలని కోరారు. సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ అని పొగిడారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ కాదని, ఆర్ఎస్ఎస్ కు చెందిన నాయకుడన్నారు. కేసీఆర్ను మహ్మద్ ప్రవక్తతో పోల్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ లీడర్లు మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ ను ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట అడ్డగించే యత్నం చేశారు. గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని కాన్వాయ్ను పంపించేశారు.