
భైంసా, వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముథోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిందని.. మరింతగా అభివృద్ధి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రజలను కోరారు. కోట్ల రూపాయలతో రోడ్లు, మురికి కాలువలు నిర్మించామని.. ఎన్నో ప్రగతి పనులు చేపట్టామని చెప్పారు. మంగళవారం భైంసాలోని పార్టీ ఆఫీస్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభపై మీటింగ్ నిర్వహించారు.
ఈ నెల 3న సీఎం కేసీఆర్ వస్తుండడంతో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పట్టణంలోని పలు కాలనీల నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ జేకే పాటిల్, డైరెక్టర్ తోట రాము, లీడర్లు పిప్పెర కృష్ణ, సయ్యద్ ఆసీఫ్, మురళీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.