ఒకే వేదికపై కేసీఆర్, జగన్

ఒకే వేదికపై కేసీఆర్, జగన్

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చాలా రోజుల తర్వాత కలిశారు. ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు కనిపించారు. ఆదివారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడితో శంషాబాద్‌లోని వీఎంఆర్ గార్డెన్‌లో జరిగింది. ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి వధువరులను ఆశీర్వదించారు. 

అయితే వివాహ వేదికకు ఇద్దరు సీఎంలు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఇదే తొలిసారి. అయితే ఇద్దరు సీఎంలు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నట్లుగా సమాచారం.

మరోవైపు ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ తన టీంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. వరి కొనుగోళ్లు, ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నవారికి నష్టపరిహారం అందించడం.. వంటి అంశాలపై కేంద్రపెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది.