మళ్లీ జైలుకు సీఎం కేజ్రీవాల్

మళ్లీ జైలుకు సీఎం కేజ్రీవాల్

​తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేటితో ( జూన్​ 2)  మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. కాగా అనారోగ్యం కారణంగా తనను ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

 కేజ్రీవాల్​ ఇంటినుంచి బయలు దేరిన తరువాత మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందారు. లొంగిపోయే ముందు ఆయన ఆప్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతలతోచర్చించి.. ఆ తర్వాత తీహార్ జైలులో లొంగిపోయారు. 

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మార్చి నెలలో అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మే 10 నుంచి జూన్ 1 వరకు 21 రోజుల పాటు కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.మరోవైపు ఢిల్లీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ జూన్ 5న విచారణకు రానుంది.