
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి ‘పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23, ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా గుట్టకు హాజరై మహాపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పంచతుల బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్.
ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్ లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం.. మొదటగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ఏర్పాటు చేస్తున్న స్వర్ణ విమాన గోపురం దేశంలోనే అతి ఎత్తయిన ఏకైక స్వర్ణ విమాన గోపురం. దాదాపు68 కిలోల బంగారంతో స్వర్ణతాపడం చేశారు.
స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవంలో సీఎం తో పాటు సీఎస్ శాంతాకుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.