
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటన స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని మంత్రి వివరించారు. సహాయక చర్యల విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.