
హైదరాబాద్: కాంప్లిమెంటరీ పాసుల విషయంలో SRH యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాసుల కోసం SRH మేనేజ్మెంట్ను ఇబ్బంది పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కాంప్లిమెంటరీ పాసుల కోసం హెచ్సీఏ తమను బెదిరింపులకు గురి చేసిందని SRH యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది.
ALSO READ | సన్ రైజర్స్, హెచ్సీఏ మధ్య టికెట్ల గొడవ.. చిచ్చు పెట్టిన ఈ–మెయిల్
పాసులు ఇవ్వకపోతే స్టేడియంలోని కొన్ని బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని ఆరోపించింది. ఇలాగైతే మా వల్ల కాదని.. మేం వేరే చోటుకు వెళ్లిపోతామని హెచ్సీఏకి లేఖ రాసింది SRH మేనేజ్మెంట్. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య రాజుకున్న పాసుల వివాదం హాట్ టాపిక్గా మారడంతో దీనిపై సీఎంవో ఆరా తీసింది. ఈ మేరకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. ఈ మేరకు SRH యాజమాన్యాన్ని పాసుల కోసం బెదిరించిన అంశంపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది.
ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. చిల్లర వివాదాలతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వేరే చోటుకి తరలివెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే SRH యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.