రూ. 1,891 కోట్ల బ‌కాయిలు చెల్లించండి.. కేంద్ర మంత్రికి CM రేవంత్, మంత్రి ఉత్తమ్ విన‌తి

రూ. 1,891 కోట్ల బ‌కాయిలు చెల్లించండి.. కేంద్ర మంత్రికి CM రేవంత్, మంత్రి ఉత్తమ్ విన‌తి

ఢిల్లీ: భార‌త ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖ‌రీఫ్ కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు రావాల్సిన రూ.1,468.94 కోట్ల బకాయిలు వెంట‌నే చెల్లించాలని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగ‌ళ‌వారం(మార్చి 4) కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో  క‌లిశారు. ఈ సందర్భంగా వీరు.. గతంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భ‌రించిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ‌కాయిలు పెట్టి ప‌దేళ్లయినందున తక్షణమే విడుద‌ల చేయాల‌ని ఆయనను కోరారు. 

ప్రధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద 2021 మే నుంచి 2022 మార్చి వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన అద‌న‌పు బియ్యం, 2022 ఏప్రిల్ నెల‌లో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వుల‌ను ధ్రువీక‌రించుకొని.. వీటికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్‌ వ‌ర‌కు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బ‌కాయిలు రూ.79.09 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని వారు కోరారు. 

సీఎంఆర్ (క‌స్టమ్ మిల్లింగ్ రైస్‌) గ‌డువు నెల రోజుల చొప్పున కాకుండా క‌నీసం నాలుగు నెలలు పొడిగించాల‌ని, అప్పుడే స‌ర‌ఫ‌రాలో ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తవ‌ని వీరు.. కేంద్ర మంత్రి జోషికి తెలియ‌జేశారు. 

4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్..

రాష్ట్రానికి పీఎం కుసుమ్ కింద గ‌తంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమ‌తులు పున‌రుద్ధరించాల‌ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ‌తంలో నాలుగు వేల మెగావాట్లకు అనుమ‌తులిచ్చి.. తరువాత రోజుల్లో దాన్ని కేంద్రం వెయ్యి మెగావాట్లకు కుదించిన విషయాన్ని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మ‌హిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివ‌రించారు.

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ బకాయిల విడుద‌ల‌, 4వేల మెగావాట్ల మంజూరు సోలార్ విద్యుత్ అనుమతుల పున‌రుద్ధర‌ణ విషయాల్లో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.