హెచ్​సీఏ, సన్​రైజర్స్​ వివాదంపై.. విజిలెన్స్​ ఎంక్వైరీ! ఆదేశించిన సీఎం రేవంత్​

హెచ్​సీఏ, సన్​రైజర్స్​ వివాదంపై.. విజిలెన్స్​ ఎంక్వైరీ! ఆదేశించిన సీఎం రేవంత్​
  • హెచ్​సీఏ, సన్​రైజర్స్​ వివాదంపై.. విజిలెన్స్​ ఎంక్వైరీ!
  • ఆదేశించిన సీఎం రేవంత్​
  • ఐపీఎల్​ పాస్​ల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు
  • హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ బ్లాక్ మెయిల్‌‌ చేస్తున్నాడన్న ఎస్​ఆర్​హెచ్​ ఫ్రాంచైజీ
  • ఒప్పందం  ప్రకారం టికెట్లు అడిగితే బెదిరించినట్టా?: హెచ్‌‌సీఏ

హైదరాబాద్, వెలుగు: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్‌‌) పాసుల విషయంలో  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ),  సన్‌‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌‌హెచ్) ఫ్రాంచైజీ   మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరాయి. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి.  హైదరాబాద్ బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు. ఎస్‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌, హెచ్‌‌సీఏ వివాదంపై విజిలెన్స్​విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. 

ఇదీ వివాదం

తమిళనాడుకు చెందిన సన్‌‌ నెట్‌‌ వర్క్‌‌  యాజమాన్యంలోని సన్‌‌ రైజర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్‌‌లో అడుగు పెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌‌ను తమ హోమ్‌‌ గ్రౌండ్‌‌గా ఎంచుకొని ఉప్పల్‌‌ స్టేడియంలో మ్యాచ్‌‌లు ఆడుతున్నది. ఐపీఎల్‌‌ టైమ్‌‌లో ఉప్పల్‌‌ స్టేడియాన్ని రెంట్‌‌కు తీసుకుంటున్నది. ఇందుకు ప్రతి మ్యాచ్‌‌కు హెచ్‌‌సీఏకు రూ.కోటి చెల్లిస్తున్నది. ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌ టికెట్ల విక్రయాలను సన్ రైజర్స్ ఫ్రాంచైజీనే  చూసుకుంటున్నది. స్టేడియం కెపాసిటీ 39 వేలు కాగా.. ఇందులో పది శాతం అంటే 3,900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో హెచ్‌‌సీఏకు ఉచితంగా ఇస్తున్నది. 

వీటిలో రూ. 750 కనీస ధర టికెట్ల నుంచి  రూ. 20 వేలు విలువ చేసే అన్ని సౌకర్యాలతో కూడిన కార్పొరేట్ బాక్స్‌‌ పాసులు కూడా ఉంటాయి. కార్పొరేట్ బాక్సు పాసుల కేటాయింపు విషయంలో సన్ రైజర్స్‌‌కు, హెచ్‌‌సీఏ ఆఫీస్ బేరర్లకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్ స్టేడియం సౌత్ స్టాండ్ ఫస్ట్‌‌ ఫ్లోర్‌‌‌‌లోని  ఎఫ్‌‌–12-ఏ బాక్సులో గత పదేండ్ల నుంచి హెచ్‌‌సీఏకు సన్ రైజర్స్ 50 టికెట్లు కేటాయిస్తున్నట్టు చెబుతున్నది. కానీ, ఆ బాక్స్‌‌ కెపాసిటీ 30 సీట్లు మాత్రమే అని హెచ్‌‌సీఏ అంటున్నది. కాబట్టి మిగతా 20 టికెట్లు వేరే బాక్సుల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఈ సీజన్ ముందుగానే రిక్వెస్ట్ చేయగా..సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఒప్పుకున్నది. 

అయితే, గత రెండు మ్యాచ్​లలో  ఆ బాక్సుకు 50 టికెట్లు కేటాయించినట్టు చెబుతున్నది. ఈ నెల 27న లక్నో మ్యాచ్ సందర్భంగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది. ఇతర బాక్సుల్లో 20 టికెట్లు కేటాయించాలంటూ   పట్టుబట్టినా వినకపోవడంతో  ఎఫ్‌‌3 బాక్సుకు హెచ్‌‌సీఏ తాళం వేసింది. దాన్ని  లక్నో ఓనర్‌‌‌‌ సంజీవ్‌‌ గోయెంకకు కేటాయించడంతో హెచ్‌‌సీఏ పెద్దలు కావాలనే తమను బ్లాక్‌‌మెయిల్ చేశారంటూ సన్‌‌ రైజర్స్ ఫ్రాంచైజీ శ్రీనాథ్‌‌ ఈ మెయిల్ లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. 

హెచ్‌‌సీఏ వాదన ఇది..

సన్‌‌ రైజర్స్ ఫ్రాంచైజీ ఆరోపణలను హెచ్‌‌సీఏ ఖండించింది. తమ ఆఫీస్‌‌ బేరర్ల పట్ల కొందరు  ఎస్ఆర్‌‌హెచ్ ఉద్యోగుల అనుచిత తీరువల్లే ఈ సమస్యలు వస్తున్నాయని, హెచ్‌‌సీఏ ప‌‌రువుకు భంగం క‌‌లిగించేలా చేయ‌‌డం సరికాదని తెలిపింది. ‘గ‌‌త రెండు మ్యాచ్‌‌ల‌‌కు ఎస్ఆర్‌‌హెచ్  మాకు 3,880 కాంప్లిమెంట‌‌రీ పాసులే ఇచ్చింది. ఎఫ్‌‌-12–ఏ బాక్సులో సామ‌‌ర్థ్యానికి మించి  50 టిక్కెట్లు ఇస్తామంటే, మేం ఆ బాక్సులో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులు మ‌‌రో బాక్సులో స‌‌ర్దుబాటు చేయ‌‌మ‌‌న్నాం. 

సన్ రైజర్స్‌‌ అధికారుల నుంచి ఎంతకూ స్పందన లేకపోవడం వల్లే ఈ నెల 27న‌‌ ఎఫ్‌‌–-3 బాక్స్‌‌ను తాత్కాలికంగా లాక్ చేయాల్సి వచ్చింది. అయితే, ఎస్ఆర్‌‌హెచ్ ప్రతినిధులు కిర‌‌ణ్‌‌, శ‌‌ర‌‌వణ‌‌న్‌‌, రోహిత్ సురేశ్​ వచ్చి మాట్లాడటంతో  మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందు బాక్స్ తిరిగి తెరిచాం. కానీ, హెచ్‌‌సీఏ ట్రెజరర్​ సీజే శ్రీనివాస్‌‌తో జ‌‌రిగిన ఈ భేటీలో పాల్గొన‌‌ని శ్రీనాథ్  బ్లాక్‌‌మెయిల్ చేస్తున్నార‌‌నే అర్థంతో ఈ-మెయిల్‌‌ చేయడం సరికాదు’ అని హెచ్‌‌సీఏ ప్రకటనలో తెలిపింది.  

కూర్చొని మాట్లాడుకుందాం..

హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్ మ్యాచ్‌‌కు మరో 10 శాతం టికెట్లను త‌‌న వ్యక్తిగత  అవ‌‌స‌‌రాల కోసం అడగలేదని, హెచ్‌‌సీఏ క్లబ్‌‌ సెక్రటరీలకు ఉచిత పాసులు స‌‌రిపోక డ‌‌బ్బులు పెట్టి కొనుగోలు చేసేందుకు అవ‌‌కాశ‌‌మివ్వాల‌‌ని అపెక్స్ కౌన్సిల్ గ‌‌త నెల 19వ తేదీ ఎస్ఆర్‌‌హెచ్‌‌ను అధికారికంగా కోరిందని తెలిపింది.  ఈ విషయం పెండింగ్‌‌లోనే ఉండ‌‌గా, ప్రెసిడెంట్‌‌ వ్యక్తిగత అవసరాల కోసం 2,500 టికెట్లను  బ్లాక్ చేయాలని అడిగ‌‌న‌‌ట్టు  ప్రచారం చేయడం స‌‌మంజ‌‌సం కాదని పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన వివాదాలను పక్కన బెట్టి ఇరు వర్గాలు సమావేశమై చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపింది. ప్రెసిడెంట్ జగన్‌‌తో ఇబ్బంది అయితే  ఈ సీజన్‌‌లో  సన్ రైజర్స్‌‌, హెచ్‌‌సీఏ  సమావేశాల్లో  ఆయన పాల్గొనబోరని చెప్పింది.

సన్ రైజర్స్‌‌ ఆరోపణలు ఇవి..

హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ జగన్ మోహన్ రావు తమ సిబ్బందిపై బ్లాక్‌‌మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్‌‌ ఆరోపించింది. ఈ నెల 27న లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఎఫ్‌‌3 కార్పొరేట్ బాక్స్‌‌ను లాక్ చేయడం ద్వారా అదనపు టిక్కెట్ల కోసం బలవంతం చేశారని పేర్కొంది. ‘‘తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి మ్యాచ్‌‌కు 10 శాతం టికెట్లు (3,900) నేరుగా కొనేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌‌  బలవంతం చేశారు. చివరికి మేం 2వేల టికెట్లు  కేటాయించేందుకు ఒప్పుకున్నాం. 

కానీ, అవి దుర్వినియోగం అవ్వకుండా హెచ్‌‌సీఏ అకౌంట్ నుంచే కొనాలని కోరితే.. వేర్వేరు అకౌంట్ల నుంచి కొనేందుకు అనుమతించాలని తమపై ఒత్తిడి తెచ్చారు. మేం ఒప్పుకోకపోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఐపీఎల్ సీజన్‌‌ ప్రారంభానికి ముందు నుంచే హెచ్‌‌సీఏ  ప్రెసిడెంట్ మా  సిబ్బందిని బెదిరిస్తూ వస్తున్నారు.’ అని ఈమెయిల్‌‌లో పేర్కొన్నది.  ఈ సీజన్‌‌కు ముందు స్టేడియానికి రంగులు వేయడం, టాయిలెట్లు శుభ్రం చేయడం, కార్పొరెట్‌‌ బాక్స్‌‌ల్లో మార్పులు, ఏసీ రిపేర్లు వంటివి తమ ఖర్చుతోనే చేసినా.. హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్ మీడియా ఇంటర్వ్యూలో ఆ పనులన్నీ తానే చేశానని ప్రచారం చేసుకున్నారని ఆరోపించింది. హెచ్‌‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌‌తో సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరినట్టు ఎస్‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌ ఫ్రాంచైజీ తెలిపింది.