
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.
డాక్టర్ అంబేద్కర్ గారి పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాబాసాహెబ్ గారి స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం (ఏప్రిల్ 14) పది గంటల తర్వాత అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు నేతలు నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్పై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహానికి పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ట్యాంక్ బండ్పై పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ట్రాఫిక్ ఆగకుండా చూస్తున్నారు.