
- కుటుంబీకులతో ఫోన్ లో మాట్లాడి హామీ ఇచ్చిన సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్
భీమదేవరపల్లి, వెలుగు: మండలంలోని రంగయ్య పల్లి కి చెందిన పేద యువకుడు రాకేశ్ కండరాల వ్యాధితో బాధపడుతూ.. వైద్యం చేయించుకోలేకపోతున్న పరిస్థితులను తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాకేశ్ కు ట్రీట్మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచిత వైద్యం , ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాకేశ్ కుటుంబీకులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు.
రాకేశ్ చాలా కాలం నుంచి కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత వల్ల నడవలేని పరిస్థితికి వచ్చాడు. రాకేశ్ కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేశ్ కుటుంబం పరిస్థితిపై పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
ములకనూరు లోని ఓ ప్రైవేటు కాలేజీలో రాకేశ్ ఇంటర్ చదువుతున్నాడు. స్వగ్రామం నుంచి ములకనూరు వెళ్లి రావడానికి చార్జింగ్ వెహికల్ ను కూడా ప్రభుత్వం అందించనున్నది. అధికారుల ఆదేశాల తో వంగర పీహెచ్సీ డాక్డర్ రహమన్,రూబీనా,రాజశేఖర్ రంగయ్యపల్లి గ్రామానికి వచ్చి రాకేశ్ను పరీక్షించారు. ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేశ్తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.