పేద యువకుడి వైద్యానికి ముఖ్యమంత్రి సహాయం

పేద యువకుడి వైద్యానికి ముఖ్యమంత్రి సహాయం
  • కుటుంబీకులతో ఫోన్​ లో మాట్లాడి    హామీ ఇచ్చిన సీఎం  ఓఎస్డీ వేముల శ్రీనివాస్​

భీమదేవరపల్లి, వెలుగు:   మండలంలోని  రంగయ్య పల్లి కి చెందిన  పేద యువకుడు రాకేశ్​ కండరాల వ్యాధితో బాధపడుతూ..  వైద్యం చేయించుకోలేకపోతున్న పరిస్థితులను తెలుసుకొని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.  రాకేశ్​ కు   ట్రీట్​మెంట్​  అందించాలని  అధికారులను ఆదేశించారు. ఉచిత  వైద్యం , ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని  సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో  సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాకేశ్​ కుటుంబీకులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు. 

రాకేశ్​ చాలా కాలం  నుంచి  కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత వల్ల  నడవలేని పరిస్థితికి వచ్చాడు.  రాకేశ్​ కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేశ్​ కుటుంబం పరిస్థితిపై  పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి  స్పందించారు.

ములకనూరు లోని ఓ ప్రైవేటు కాలేజీలో రాకేశ్​ ఇంటర్   చదువుతున్నాడు. స్వగ్రామం నుంచి ములకనూరు వెళ్లి రావడానికి చార్జింగ్ వెహికల్ ను కూడా ప్రభుత్వం అందించనున్నది.  అధికారుల ఆదేశాల తో వంగర పీహెచ్​సీ డాక్డర్​  రహమన్​,రూబీనా,రాజశేఖర్​  రంగయ్యపల్లి గ్రామానికి వచ్చి రాకేశ్​​ను పరీక్షించారు.  ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేశ్​తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.