బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్‌తో కఠినంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి

బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్‌తో కఠినంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్ తో ఫ్రెండ్లీగా ఉండటం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేరస్తుల పట్ల కఠినంగానూ.. బాధితులతో ఫ్రెండ్లీగా ఉండటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు అక్టోబర్ 21 నుంచి 10రోజులపాటు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని గోషా మహాల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ దినోత్సవ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అథితిగా రేవంత్ రెడ్డి హాజరైయ్యారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఆయన నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ అధికారులు, పోలీస్ డిపార్ట్ మెంట్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 

తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంశించారు. ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే కారణం పోలీసులే అని.. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెట్టడానికి ముందుకు రారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని  కాపాడటానికి ఎంతో మంది పోలీసులు అమరులు అయ్యారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు. పోలీసుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సైబర్ క్రైమ్స్ నివారించడానికి తెలంగాణ పోలీసులు బాగా కృషి చేస్తున్నారని కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా మెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

Also Read :- తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..

పోలీసులు జీతం కోసం పని చేయడంలేదని.. గౌరవ మర్యాదలతో మాత్రమే ఖాకీ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తున్నారని సీఎం అన్నారు. పోలీసులు ఆత్మగౌవరంగా బ్రతకాలని పోలీసులకు సూచించారు.. ఎవరి ముందు చేయి చాచొద్దన్నారు. రోజుల తరబడి డ్యూటీలో నిమగ్నమైన పోలీసులకు అలవెన్సులు ఇచ్చే దగ్గర ప్రభుత్వం వెనుకాడబోదని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా డ్యూటీలో అమరులైన పోలీసు కుటుంబాలకు నష్ట పరిహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

50 ఎకరాల విస్థీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ అడ్మిషన్లు తీసుకుంటామని.. బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తోపాటు అన్ని రంగాన్ని రాణించేలా డిపార్ట్‌మెంట్ వారి పిల్లలకు విద్య అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.