90 రోజుల్లో మరో 30 వేల కొలువులు..

90 రోజుల్లో మరో 30 వేల కొలువులు..
  • ఏడాది తిరక్క ముందే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తం
  • ఆందోళనలు చేయొద్దు.. మా వద్దకు వచ్చి మాట్లాడండి
  • మీ అన్నగా సమస్య పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నా
  • రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం
  • బడ్డెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయానిక పెద్దపీట వేశాం
  • ఫైర్ మెన్ ల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాబోయే 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని చెప్పారు. ఏడాది తిరక్క ముందే 60 వేల కొలువులు ఇస్తున్నామని చెప్పారు. ఇది ప్రజా ప్రభుత్వమని, నిరుద్యోగులు ఆందోళన చేయవద్దని తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలని అన్నారు. మంత్రులు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మీ అన్నగా నిరుద్యోగుల సమస్యలు వినేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని సీఎం చెప్పారు. ఇవాళ వట్టి నాగుల పల్లిలోని అగ్ని మాపకశాఖ శిక్షణా కేంద్రలో 483 మంది ఫైర్ మెన్ ల పాసింగ్ ఔట్ పరేడ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో  157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు సీఎం నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను, ఆస్తులను పరిరక్షిస్తున్న అగ్నిమాపక శాఖ తీరు అభినందనీయమన్నారు. పరేడ్ లో  పాల్గొన్న ఫైర్ మెన్ లను  చూస్తుంటే వాళ్ల తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తూ ఉంటారనిపిస్తోందన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో గ్రామీణ  ప్రాంతాల వారే ఎక్కువన్నారు. ఎల్బీ స్టేడియం లో ఉద్యోగ పత్రాలు అందుకున్న ఫైర్ మెన్ నాలుగు నెలలు కఠిన శిక్షణ తీసుకొని ప్రజా సేవకు సిద్ధమయ్యారన్నారు. కొందరు యువకులు ఉద్యోగాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా ఆదుకోవాలని సీఎం సూచించారు.  తెలంగాణ ఏర్పాటు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోరాటాలు చేశారని, వారి ఆకాంక్షలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం అన్నారు.  రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేండ్లు కొలువుల కోసం ఎదురు చూశారన్నారు. గత ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చలేదని గుర్తు చేశారు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్య, వైద్యం, సాగునీటి రంగాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించామని సీఎం చెప్పారు.

2 లక్షల 91 కోట్ల బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలిసేది కాదని, తాము మొదటి తారీఖునే జీతాలతోపాటు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పెన్షన్లు కూడా ఇస్తున్నామని పునరుద్ఘాటించారు.
 
ఆందోళనలు వద్దు.. మాట్లాడుకుందాం రండి

కొంత మంది నియామక పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారని, ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, సమస్యలు వినేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని, మీ అన్నలా తాను కూడా సిద్ధమేనని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామని సీఎం అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు.  ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి  ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి జిల్లాకో ఫైర్ ఆఫీసర్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. అగ్ని ప్రమాదాలే కాకుండా ఎలాంటి విపత్తులు వచ్చినా ముందుండాలని సూచించారు.