
- పునర్విభజన చేస్తే.. సౌత్ కు 33% సీట్లు ఉండాలి
- న్యాయబద్ధమైన డీలిమిటేషన్ కోసం పోరాడుదాం
- ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది
- సౌత్ తోపాటు కొన్ని నార్త్ స్టేట్స్ కు అన్యాయం
- తెలంగాణ రూపాయి వెళ్తే కేంద్రం ఇస్తున్నది 42 పైసలే
- చెన్నయ్ లో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో సీఎం రేవంత్
- ఈ దేశం ఎవరి సొత్తూ కాదు.. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు
- సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోతాయి : తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నయ్: డీలిమిటేషన్ ప్రక్రియను మరో పాతికేండ్ల పాటు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక వేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం లోక్ సభ సీట్లలో 33% ఉండేలా చూడాలని అన్నారు. న్యాయబద్ధమైన డీలిమిటేషన్ కోసం సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఇవాళ చెన్నయ్ లోని హోటల్ ఐటీసీ చోళలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి హాజరై మాట్లాడారు. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్పై మనమంతా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదన్నారు. గతంలో వాజ్పేయి లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని, ఇప్పుడు మోడీ కూడా అదే పని చేయాలన్నారు. కేంద్ర నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల్లో సరైన వాటా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక అభివృద్ధి జీడీపీ, ఉద్యోగ కల్పనతో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయన్నారు. దేశానికి దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ మనకు తిరిగి వచ్చేది తక్కువ అని అన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి కేంద్రం తిరిగి ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమే అని చెప్పారు. బీహార్ రాష్ట్రం రూపాయి చెల్లిస్తే ఆరు రూపాయలు కేంద్రం ఇస్తోందని చెప్పారు. యూపీ కూడా రూపాయి పన్నులు కట్టి రెండు రూపాయలు తీసుకుంటోందని అన్నారు. ఈ అసమానతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, లోక్సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని కోరారు.
దక్షిణాది బలహీన పడుతుంది
జనాభా నియంత్రణ పాటించిన కారణంగా దక్షిణాది తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. న్యాయమైన డీలిమిటేషన్ సాధించే వరకు ఐక్యంగా ఉండి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. డీలిమిటేషన్కు తాము వ్యతిరేకం కాదని.. న్యాయబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనే తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా నిరసనలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలను అణచివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు, మమత డుమ్మా
చెన్నయ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. జగన్ కూడా సమావేశానికి వెళ్లలేదు. ఆయన లేఖ రాశారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. జనాభా ప్రాతిదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సైతం మీటింగ్ కు దూరంగా ఉండటం గమనార్హం.
తెలంగాణ నుంచి ఆరుగురు
చెన్నయ్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి ఆరుగురు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ తరఫున హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ సమావేశానికి వెళ్లారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలు భగవంత్మాన్, పినరయ్ విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.