నేటి నుంచి సీఎం జిల్లాల టూర్

నేటి నుంచి సీఎం జిల్లాల టూర్
  • ఎక్కడి సమస్యలపై అక్కడే రివ్యూ
  • తొలిరోజు మహబూబ్​నగర్​లో పర్యటన
  • విడతల వారీగా అన్ని జిల్లాల్లోనూ..!

హైదరాబాద్​, వెలుగు: జిల్లాల్లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. విడతల వారీగా చేపట్టే ఈ పర్యటనలో స్థానిక సమస్యలపై అక్కడే  ఉన్నతాధికారులతో రివ్యూ చేపట్టనున్నారు. ఆయా జిల్లాలకు ఏమేం కావాలో ఆరా తీయనున్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి మహబూబ్‌‌నగర్‌‌కు బయలుదేరుతారు.

మధ్యాహ్నం 12.45 నుంచి ఒంటి గంట వరకు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి..  ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖాముఖి అవుతారు. ఒంటి గంటకు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్‌‌నగర్‌‌లోని ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు.

ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేస్తారు. ఇటీవల సెక్రటేరియెట్​లో అన్ని ప్రభుత్వ శాఖల సెక్రటరీలతో భేటీ అయిన సీఎం రేవంత్.. త్వరలోనే జిల్లాల పర్యటన చేపడ్తానని, వారంకోసారి వస్తానని ప్రకటించారు. ఇకపై తాను కూడా ఫీల్డ్‌‌లోకి దిగుతానని స్పష్టం చేసిన చేశారు. ఈ మేరకు సీఎం జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది.