2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ సర్కారు సన్నాహాలు

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ సర్కారు సన్నాహాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు​ ప్లాన్​ చేస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్​కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి, మళ్లీ నోటిఫికేషన్​ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగానే గ్రూప్​–1 లో పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. ఇప్పుడు పోలీసు, టీచర్, గురుకుల, వివిధ పోస్టుల భర్తీతోపాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్​– 2, 3,4 కు సంబంధించి జాబ్​ క్యాలెండర్​ రూపకల్పన చేస్తున్నది. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. 

దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్​చేయాలనుకుంటున్నది. ఏటేటా రిటైర్మెంట్​అవుతున్న కొద్దీ.. వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ, డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​​పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ 30 వేలకు పైగా  మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. 

 మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్​మెంట్​బోర్డు పరిధిలో 6,956 స్టాఫ్​నర్స్, పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డు అధ్వరంలో 14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన 7,800 మంది టీచర్లు, లెక్చరర్లకు నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ అధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్​మెంట్​ ద్వారా 87 పోస్టులను భర్తీ చేసింది.  ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డీఎస్సీని  ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.