ఇందూరులో సీఎం రేవంత్​రెడ్డి సభ సక్సెస్

ఇందూరులో సీఎం రేవంత్​రెడ్డి సభ సక్సెస్
  • కాంగ్రెస్​ శ్రేణుల్లో ఫుల్​ జోష్ నింపిన సీఎం సభ
  • గ్రాడ్యుయేట్, నిరుద్యోగులు, టీచర్ల సమస్యలు గుర్తెరిగిన అభ్యర్థిని నిలబెట్టాం
  • నరేందర్​రెడ్డిని గెలిపించాలని పిలుపు
  • ప్రతిపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో చురకలు
  • నిజాంసాగర్​ ప్రాజెక్టు, నిరంతర కరెంట్​తో జిల్లాలో సాగు పెరిగింది
  • ఇక్కడి రైతన్నలు చైతన్యవంతులని కితాబు
  • ఆద్యంతం ఆసక్తిగా సాగిన సీఎం రేవంత్​రెడ్డి ప్రసంగం

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​ నగరంలో సోమవారం నిర్వహించిన సీఎం రేవంత్​రెడ్డి గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ సక్సెస్​ అయ్యింది.   సీఎం రాక కాంగ్రెస్  శ్రేణుల్లో జోష్ నింపగా, విద్యావంతుల్లో ఆలోచన రేకెత్తించింది.  మధ్యాహ్నం 1.35 గంటల నుంచి 2.25 వరకు సీఎం ప్రసంగం ఆసక్తిగా కొనసాగింది. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ తనదైన శైలిలో చురకలు అంటించారు.  కాంగ్రెస్​కు ఓటెందుకు వేయాలో చెబుతూ తన సర్కారు హయాంలో చేసిన ప్రతి పనికి సంబంధించిన లెక్కలు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు.  గ్రాడ్యుయేట్, నిరుద్యోగులు, టీచర్ల సమస్యలు గుర్తెరిగిన అభ్యర్థి నరేందర్​రెడ్డిని నిలబెట్టామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.  

నిజాంసాగర్​ ప్రాజెక్టు, నిరంతర కరెంట్​తో జిల్లాలో సాగు పెరిగిందని, నిజామాబాద్​ జిల్లా రైతులు చైతన్యవంతులని కితాబునిచ్చారు.  వ్యవసాయ సమస్యలపై గవర్నమెంట్​ను వణికించి సాధించే పంజాబ్​, హరియానా రైతన్నల స్ఫూర్తి ఇందూర్​లో చూశానని,  ఆర్మూర్​లో జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న తరువాతే టీపీసీసీ ప్రెసిడెంట్​బాధ్యతలు చేపట్టి సీఎం దాకా ఎదిగానన్నారు.  ఎస్సారెస్పీ నిర్మించిన కాంగ్రెస్​ గవర్నమెంట్ గుత్ప, అలీసాగర్ స్కీంల ఏర్పాటుతో జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. నిజాంసాగర్​ ప్రాజెక్టు నీరు, నిరంతర ఉచిత విద్యుత్​తో జిల్లాలో సాగు పెరిగిందన్నారు.  సన్నరకం వడ్లకు  మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్​ ఇచ్చామన్నారు. జిల్లాకు చెందిన బాక్సింగ్​ ఛాంపియన్​ నిఖత్​జరీన్​కు గ్రూప్​-1స్థాయి డీఎస్పీ జాబ్​ ఇచ్చి గౌరవించామని, రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశామన్నారు. 

ఎన్ని లక్షల ఖాళీలున్నా భర్తీ చేస్తం..

ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్​కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.  పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, నిరుద్యోగులఆశలన్నీ ఆవిరయ్యాయన్నారు. వైఎస్​రాజశేఖర్​రెడ్డి తరువాత విజన్​తో పాటు తపన , పట్టుదల ఉన్న మహానేత రేవంత్​రెడ్డి అన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన  తొమ్మిది నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.  ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను క్లోజ్ చేస్తున్నదని విమర్శించారు. అదానీ, అంబానీల కోసం కేంద్రం పనిచేస్తుందని, కేంద్రం ఇచ్చిన సున్నా బడ్జెట్​పై రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​గౌడ్​

రాళ్లను పూలుగా మారుస్తున్న కార్యకర్తలు..

ఆంధ్ర కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తెలంగాణ ఎదుగుతున్నదని  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్​రెడ్డి అన్నారు. ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా తనపై రాళ్లు విసురుతుండగా, కాంగ్రెస్​ కార్యకర్తలు పూలుగా మారుస్తున్నారని తెలిపారు. తెలంగాణ వర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. కాలేజీలకు బకాయి పడ్డ స్టూడెంట్ స్కాలర్​షిప్​లు మూడు నెలల్లో అందించాలని, ఉర్దూ గర్స్ కాలేజీని కొత్త బిల్డింగ్​లోని మార్చాలని కోరారు. 

కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్​బాబు, జూపల్లి కృష్ణారావు, గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, మదన్మోహన్​రావు, లక్ష్మీకాంతారావు, కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహెర్, ఈరవత్రీ అనీల్, అన్వేష్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్​రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, నుడా చైర్మన్​ కేశవేణు, లైబ్రరీ కమిటీ చైర్మన్​ రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.