![డెస్టినేషన్ వెడ్డింగ్లకు రాష్ట్రం వేదిక కావాలి](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-instructs-officials-to-boost-tourism-in-telangana_0GUa5efbCK.jpg)
- ఆదాయం, ఉపాధి కల్పించేలా టూరిజం
- పర్యాటక శాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించే వనరులు ఎన్నో ఉన్నా.. గతంలో ప్రచారంపైన శ్రద్ధ చూపకపోవడం, వినూత్న పద్ధతిలో ఆలోచించకపోవడంతో పర్యాటక రంగంలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. తెలంగాణ చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలి”అని అధికారులను ఆయన ఆదేశించారు.
పర్యాటక శాఖపై హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయన సూచించారు. ‘‘నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలి. డెస్టినేషన్ వెడ్డింగ్లకు తెలంగాణను వేదికగా మార్చాలి” అని చెప్పారు.
ఆలయాలు, పులుల అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని.. ఆ దిశగా దృష్టిసారించి అవసరమైన చర్యలు తీసుకోవాల అధికారులను ఆదేశించారు. భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెల తీర్థం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు.. ఇట్ల ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలన్నారు.
భువనగిరి కోట రోప్వే పనులకు త్వరలో టెండర్లు
భువనగిరి కోట రోప్ వే పనులపైనా సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. ఈ పనులకు భూ సేకరణలో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు భూ సేకరణ పూర్తయినందున త్వరలో టెండర్లు పిలుస్తామని సీఎంకు అధికారులు తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా భువనగిరి కోట రోప్ వే పనులకు టెండర్లు పిలవడంతో పాటు కోటపై ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకోవాలని.. ఒక శాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య అవసరాలకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకుల్లా వచ్చిపోయేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామనిన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.