ఈరోజు ఖైరతాబాద్​ గణపతి పూజకు సీఎం రేవంత్​రెడ్డి

ఈరోజు ఖైరతాబాద్​ గణపతి పూజకు సీఎం రేవంత్​రెడ్డి

ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్​ శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిని భక్తుల దర్శనానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు జరగనున్న ప్రత్యేక పూజకు సీఎం రేవంత్​రెడ్డి హాజరు కానున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నట్టు సమచారం. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్​ జిష్ణు దేవ్ వర్మ కూడా ఖైరతాబాద్​గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అంతకుముందు ఉదయం 7  గంటలకు ఖైరతాబాద్​పద్మశాలీ సంఘం.. రాజ్​దూత్​చౌరస్తా నుంచి బయలుదేరి స్వామివారిని జంధ్యం, కండువా, గరిక మాలతో అలంకరిస్తారు. 

ఈ క్రమంలో  స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్​ మహాగణపతి విగ్రహం వద్ద  ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహానికి ఏడు ముఖాలు ఏర్పాటు చేయగా.. ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దారు. కుడివైపు చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలుండగా.. ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డూ ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు. 

సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వాడ వాడల వెలిసే గణేశ్ మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. నవరాత్రుల సందర్భంగా  హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు.  భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు.ఈ ఏడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు.