
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్ ల్ అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. అందెశ్రీ రాసిన ఈ పాటకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. సింగర్ రేవంత్, హారికా నారాయణ్ పాడారు.
అంతకుముందు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ట్యాంక్ బండ్ పై వేడుకలు
సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30 కు సీఎం ట్యాంక్ బండ్ కు చేరుకొని, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్టేజ్ షో తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివర నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. వాక్ జరుగుతున్నంత సేపు ‘జయ జయహే తెలంగాణ’ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50 కు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులు కాల్చి వేడుకలను ముగిస్తారు.