
- కేంద్ర మంత్రి జైశంకర్ను కోరిన సీఎం రేవంత్
న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే 25 ఏండ్లలో తెలంగాణను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడ్తున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో రేవంత్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా... 2025లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వంటి ప్రతిష్టాత్మకైన ప్రోగ్రామ్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు.
ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ రైజింగ్ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. విదేశాల్లో ఇండియా నిర్వహించే కార్యక్రమాల్లోనూ తెలంగాణ రైజింగ్ను ప్రచారం చేయాలన్నారు. దౌత్య, లాజిస్టిక్ సహాయంతో హైదరాబాద్లో నిర్వహించే ప్రోగ్రామ్లు సక్సెస్ చేసేందుకు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఉందన్నారు. తెలంగాణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి వెంట విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.