తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో  వర్షాలు, గాలివాన, పిడుగు పాటుతో సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు. 

ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని సీఎం హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖ ల అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్రానికి ఇవాళ, రేపుభారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. రేపు హైదరాబాద్ లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితలఆవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని అలెర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ.