
- కొత్త ప్రణాళిక రెడీ చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీర్ఖాన్పేట వరకు మెట్రో
- 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికేంద్రం నుంచి అనుమతులు
- రాగానే మెట్రో రెండో దశ పనులు పర్మిషన్ల కోసం నిరంతరం ప్రయత్నించండి
- సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సూచన
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని, ఇందుకోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలన్నారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారు.
ఈ రూట్ మెట్రో విస్తరణలో హెచ్ఎండీఏతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ను భాగస్వామ్యం చేయాలని సీఎం చెప్పారు. మెట్రో విస్తరణపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించేందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆఫీసర్లకు ఆయన స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు ఇక్కడి ఆఫీసర్లు సీఎం రేవంత్కు వివరించారు.
అనుమతులు రాగానే పనులు మొదలు
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం నుంచి -కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ నుంచి -చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్ నుంచి -పటాన్చెరు (13.4 కి.మీ.), ఎల్బీ నగర్- నుంచి హయత్ నగర్ (7.1 కి.మీ.).. ఇట్ల మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ. 24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు
భరించేలా జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది.
కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సమావేశంలో సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
పాల్గొన్నారు.