త్వరలో కుల గణన

త్వరలో  కుల గణన

 

  • త్వరలో  కుల గణన
  • అవసరమైన చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
  • గురుకులాలకు సొంత భవనాలు
  • మరింత సమర్థవంతంగా ఓవర్సీస్​ స్కాలర్ షిప్ 
  • నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్
  • గ్రీన్ చానల్ ద్వారా డైట్,  కాస్మోటిక్ చార్జీల చెల్లింపు 
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలోనే కుల గణన చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమంపై శనివారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి రివ్యూ నిర్వహించారు. కుల గణనకు అవసరమైన  చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. 

వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను రెడీ చేయాలని చెప్పారు. 

ఎంపీ సెగ్మెంట్​ యూనిట్​గా బీసీ స్టడీ సర్కిళ్లు

రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి లోక్​సభ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై స్టడీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. గ్రీన్  చానల్ ద్వారా  చెల్లింపులు చేయాలన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన స్టూడెంట్లకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్​ వర్క్ తయారు చేయాలని, వాటిలో చదివేందుకు వెళ్లే స్టూడెంట్లకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆఫీసర్లకు ఆయన సూచించారు. 

గురుకుల విద్యా సంస్థలన్నీ ఒకే చోటకు

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా వాటికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. దీంతో స్కూళ్ల  నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని చెప్పారు. 

ఎక్కువ మంది స్టూడెంట్లు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాటవాలు పెరుగుతాయని, పోటీ తత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్​లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని ఆయన అన్నారు. 

ఎడ్యుకేషన్​ హబ్​ల నిర్మాణానికి సీఎస్​ఆర్​ ఫండ్స్​

ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,  సీఎస్​ శాంతికుమారి
తదితరులు పాల్గొన్నారు.