కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించిన సీఎం రేవంత్

 కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించిన సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో  కాటమయ్య రక్షణ కవచంను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.   తర్వాత గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కుతూ పట్టుతప్పినా కింద పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను పంపిణీ చేశారు. సేఫ్టీ మోకులను గౌడన్నలతో కలిసి చెక్ చేయించారు. వాటి పనితీరు ఎలా ఉందని గౌడన్నలు అడిగి తెలుసుకున్నారు.  

 కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్,  రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్..గ్రామంలో బెల్టుషాపులపై ఆరాదీశారు. బెల్టు షాపులు తీసేశారని చెప్పారు గౌడన్నలు. ఉపాధి అవకాశాలను పెంచుతామని హామీ ఇచ్చారు రేవంత్. వనమోహోత్సవంలో తాటి,ఈత మొక్కలను పెంచుతామని చెప్పారు. కాసేపట్లో  గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు రేవంత్.

పూర్వకాలం నుంచి గీత కార్మికులు ఒకే విధమైన మోకు, ముత్తాదును ఉపయోగిస్తున్నారు. వాటితో తాటిచెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తూ జారితే కిందపడి ప్రాణాలు కోల్పోవడమో, కాళ్లు, చేతులు, నడుములు  విరిగి మంచానికే పరిమితమయ్యేవారు. అలాంటి సంఘటనలు జరక్కుండా  ఉండేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను రూపొందించాయి. 

హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును అధికారులు ప్రాక్టికల్ గా పరిశీలించారు. పనితీరు, సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోకు కిట్ లో మొత్తం ఆరు పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్ , స్లింగ్ బ్యాగ్,లెగ్ లూప్ ఉంటాయి. 

ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ ను బిగిస్తారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతో పాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకు కు ఉండే సేఫ్టీ రోప్ ను వారి నడుముకు ధరించిన బెల్ట్ కు బిగిస్తారు. దీంతో తాటిచెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కిందపడకుండా ఆపేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గీతకార్మికులందరికీ ఉచితంగా ఈ సేఫ్టీ మోకుల పంపిణీ చేసింది రాష్ట్ర సర్కార్.