- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్రెడ్డి వినతి
- హైదరాబాద్ టు విజయవాడ కొత్త కారిడార్ను ఆమోదించండి
- హైదరాబాద్-– నాగ్పూర్ కారిడార్కు ఫైనల్ పర్మిషన్స్ కావాలి
- నేషనల్ డిజైన్ సెంటర్,మెగా లెదర్ పార్క్, ఐఐహెచ్టీ మంజూరు చేయండి
- మెగా టెక్స్టైల్ పార్క్కు గ్రీన్ ఫీల్డ్ హోదా కల్పించాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన పీయూష్ గోయల్
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ టు విజయవాడ వయా మిర్యాలగూడ -నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలుపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్-– నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం వాణిజ్యభవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్–-వరంగల్ పారిశ్రామిక కారిడార్లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దాన్ని ఉప సంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కోరారు.
ఎన్ఐడీ, లెదర్ పార్క్పై..
యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్ఐడీ) మంజూరైందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఎన్ఐడీని విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్తగా ఎన్ఐడీ మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేసిందని, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినందున కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పార్క్ కు అవసరమైన భూములున్నాయని, కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులకు ఆదేశించారు.
గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చిందని,ఈ పార్క్ కు గ్రీన్ఫీల్డ్ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. బ్రౌన్ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్కు మార్చితే పార్క్కు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయని,ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ (బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు, కన్వేయర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్స్ తదితరాలు) టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్నికల్ టెక్ట్ టైల్స్ / టెస్టింగ్ సెంటర్, జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (ఐఐహెచ్టీ) మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణకు రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్ టీ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఐఐహెచ్టీ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. సమావేశంలో కేంద్ర పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీ బాలాజీ, కేంద్ర జౌళి శాఖ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కన్సల్, రాష్ట్ర జౌళి, చేనేత శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, ఢిల్లీ తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తదితరులు పాల్గొన్నారు.