
- కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి
- వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి
- టెలీమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయండి.. ఆ ఖర్చు మేం భరిస్తం
- మేం మా వాటా జలాలపైనే ప్రాజెక్టులు కట్టుకుంటున్నం
- పాలమూరు, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇవ్వండి
- తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే.. కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. గోదావరికి సంబంధించి నికర జలాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు. సోమవారం ఢిల్లీలో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డితో పాటు సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయ్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి వివరించారు.
ఏండ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది కూడా కేటాయించిన మొత్తానికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని చెప్పారు. ఇక ముందు వాటాకు మించి కృష్ణా నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలని కోరారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలీ మెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ తెలిపారు. పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ సమర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ 3 ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని సీఆర్పాటిల్ను రిక్వెస్ట్ చేశారు.
పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రాజెక్ట్
ఏపీ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిందని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ కంప్లయింట్ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని చెప్పారు. గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్కోరారు.
అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తాము నష్టపోతామని, కృష్ణా డెల్టా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేశారని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌనిల్స్లోనూ బనకచర్ల ప్రాజెక్టుపై ఎలాంటి చర్చ జరగలేదని వివరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. పాలమూరు-– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడి కుంట వాగు, చనాఖా –కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ), పీఎంఆర్పీ 2024 కింద తగిన ఆర్థిక సహాయం అందజేయాలని రిక్వెస్ట్ చేశారు.
సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 ఏండ్లపాటు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని సీఆర్ పాటిల్ను సీఎం కోరారు.