ఆర్టీసీ ప్రయాణికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

ఆర్టీసీ ప్రయాణికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీజీఎస్ఆర్టీసీపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం(సెప్టెంబర్ 10) స‌మీక్ష నిర్వ‌హించారు. మ‌హిళ‌లు మ‌హాల‌క్ష్మి ప‌థకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. 

మ‌హాల‌క్ష్మి స్కీమ్ అద్భుతం

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా ఉంద‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కితాబిచ్చారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇప్ప‌టివ‌ర‌కూ 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు  ఉచితంగా ప్ర‌యాణం చేసినట్లు తెలిపిన రవాణా శాఖ మంత్రి, మ‌హిళా ప్ర‌యాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయినట్లు తెలిపారు.  

ఆర్టీసీలో 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వివ‌రించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంద‌ని, అందుకు సంబంధించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను అధికారులు.. ముఖ్య‌మంత్రికి ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ రూపంలో చూపెట్టారు. 

వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌విష్య‌త్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు వంటివి క‌లిపి మొత్తం రూ.6,322 కోట్ల రుణాలు ఉన్న‌ట్లు అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని.. వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్చ‌న్‌పై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారులను ఆదేశించారు. సంస్థ‌పై క్రమక్ర‌మంగా రుణ‌భారం త‌గ్గించాల‌ని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం, ర‌వాణా శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.