
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2025, మే 10 నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 29) సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసే అతిథుల కోసం ఎయిర్ పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అతిథుల ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
కార్యక్రమాలకు సంబంధించి విభాగాల వారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని, మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయాల్సిన పనులు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.