
- సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాలో లేవు.. మేం ప్రజల సేవకులం
- పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినం
- స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే మా ప్రయారిటీ
- గత పదేండ్లలో వందేండ్ల విధ్వంసం జరిగింది
- రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసమైనయ్
- మేం అధికారం చేపట్టే నాటికి రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం
- ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం.. సంక్షేమం, అభివృద్ధిలో రాజీ లేదు
- తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిది
- రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం
- ‘జయ జయహే తెలంగాణ’ గీతం జాతికి అంకితం
హైదరాబాద్, వెలుగు: బానిసత్వాన్ని తెలంగాణ భరించదని.. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ సమాజ తత్వమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ జీవన శైలిలో స్వేచ్ఛ భాగమని తెలిపారు. ‘‘ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం.. ఇదీ తెలంగాణ తత్వం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం... ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు” అని ఆయన పేర్కొన్నారు.
స్వల్పకాలిక ఆలోచనలతో కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామని తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9.30 గంటలకు గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమని.. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని అన్నారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం వంటి నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని ఆయన స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.
మూడు జోన్లుగా తెలంగాణ
మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామని తెలిపారు. ‘‘3 జోన్లలో ఎలాంటి అభివృద్ధి జరగాలి.. ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కావాలి అన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం” అని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
సర్వజ్ఞానులం అన్న భ్రమలు లేవు
2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం” అని పేర్కొన్నారు. ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్గా పేరు మార్చి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ప్రజల సమస్యలు నేరుగా విని, పరిష్కరిస్తున్నామన్నారు. సెక్రటేరియెట్లోకి సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చామని తెలిపారు. ‘‘ఇందిరాపార్కులో ధర్నాచౌక్ కు అనుమతి, మీడియాకు స్వేచ్ఛ, ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తామే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళ్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా వివరించారు.
పదేండ్లలో వందేండ్ల విధ్వంసం
2014 జూన్ 2నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరిందని, అయితే అంతటితో లక్ష్యాన్ని చేరినట్టు కాదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందని అన్నారు. ‘‘దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెర వేర్చడంలో ఎక్కడ ఉన్నామనేది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. రాజకీయ విమర్శల జోలికి పోను.. అయితే చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్కు పునాదులు వేసుకోగలం.
తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం. పదేండ్ల పాలనలో తెలంగాణ వందేండ్ల విధ్వంసాని కి గురైంది. భౌతిక విధ్వసం మాత్రమే కాకుండా తెలంగా ణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామా జిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురైనయ్. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఇదంతా ఇప్పుడు గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఈ ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది” అని సీఎం రేవంత్ తెలిపారు.
ఎంప్లాయిమెంట్ జోన్గా మూసీ
మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరీవాహక ప్రాం తాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదన్నారు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ 3 కోణాలు ఇందులో ఉన్నాయన్నారు. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించామని, రీజినల్ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. తాము అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉందని, రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉందని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదని అన్నారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నం
పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది తమ ఆలోచన అని, గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించామని సీఎం తెలిపారు. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని.. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతున్నదని చెప్పారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చామని, వయో పరిమితిని 44 నుంచి 46 ఏండ్లకు పెంచామని, ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
ఆ ముగ్గురు తల్లులకు కృతజ్ఞతలు
తెలంగాణ ఏర్పాటులో మొదటి త్యాగం, సాహసం సోని యా గాంధీదేనని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఆనాడు యూపీఏ చైర్ పర్సన్గా సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ముందుకు తీసుకె ళ్లారు. బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ అప్పుడు లోక్ సభ స్పీకర్. ఒక మహిళగా.. కన్న తల్లిగా పిల్లలను కోల్పోతే ఆవేదన ఎట్లుందో తెలిసిన అమ్మగా.. మీరా కుమార్ ఆరోజు తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ సహకారాన్ని అందించారు. తెలంగాణ బిల్లును లోక్ సభలో ఆమోదించడంలో అత్యంత కీలకమైన బాధ్యత ను పోషించారు.
బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ బిల్లు ఆమోదించడంలో, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ ముగ్గురు మహిళా నేతలు చేసిన త్యాగాలు, అందించిన సహకారం తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాదిమంది ఆడబిడ్డల సాక్షిగా సోనియాగాంధీ, మీరా కుమార్, సుష్మాస్వరాజ్కు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు” అని సీఎం ప్రక టించారు. తెలంగాణ చరిత్ర పుటల్లో ఈ ముగ్గురి త్యాగానికి, తీసుకున్న గొప్ప నిర్ణయాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు.
చిహ్నం.. జాతి చరిత్రకు అద్దం
చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుందని సీఎం రేవంత్ అన్నారు. ‘‘జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం” అని వెల్లడించారు.
అదే విధంగా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా టీజీ ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని, ఉద్యమ సమయంలో టీజీ అనే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నా రని గుర్తుచేశారు. ‘‘యువత తమ గుండెలపై టీజీ అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు టీజీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని తెలిపారు.
తెలంగాణతో సోనియాకు పేగుబంధం
తెలంగాణ ప్రదాత, మాతృ సమానురాలైన సోనియాగాంధీని ఆవిర్భావ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘‘అయితే.. ఏ హెూదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని కొందరు అడుగుతున్నరు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హెూదా కావాల్నా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం. సోనియాగాంధీకి తెలంగాణతో ఉన్నది పేగుబంధం” అని ఆయన పేర్కొన్నారు.
నీళ్ల వాటా తేల్చాలి
కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘పదేండ్లైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుంటాం. సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన” అని పేర్కొన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఆదివారంతో కాలం చెల్లిందని.. ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు.
ఈ ఏడాది పేదలకు 4.50 లక్షల ఇండ్లు
రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.22,500 కోట్లు వెచ్చించి పేదల కోసం 4 లక్షల 50 వేల ఇండ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున వీటిని ఇవ్వబోతున్నామని చెప్పారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాల తో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణ యించామని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసిందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల ల కింద 26,825 స్కూళ్లలో మౌలిక సదుపా యాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం రూ.1,135 కోట్ల కేటాయించామని.. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
దావోస్ పర్యటనలో భాగంగా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు అని తెలిపారు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణ మొదలుపెట్టామని.. తద్వారా యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది తమ సంకల్పం అని అన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల యూనిఫార్మ్స్ కుట్టే ఆర్డర్ మహిళా సంఘాలకే అప్పగించామని.. గ్యాస్ సిలిండర్ను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించామని అన్నారు.
నాడు స్ఫూర్తిని రగిలించిన పాటే రాష్ట్ర గీతం
దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో.. అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ‘‘ఏ జాతికైనా సంస్కృతే అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుంచి బతుకమ్మ వరకు.. సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుంచి జోగులాంబ వరకు.. భద్రాద్రి రాముడి నుంచి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది” అని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రం వచ్చి పదేండ్లయినా రాష్ట్ర గీతం లేదని.. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించామని, సహజ కవి అందెశ్రీ రచించిన ఈ గేయం రాష్ట్ర గీతంగా ఉంటుందని అందరం విశ్వసించామని తెలి పారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన ‘‘జయ జయహే తెలంగాణ’’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నామని సీఎం చెప్పారు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగుగా పేర్కొన్నారు.
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం
తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలులేదని, దీని కోసం సంకల్పం తీసుకున్నామని సీఎం అన్నారు. ‘‘డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తున్నది. టీన్యాబ్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు సమకూరుస్తాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చాలా పట్టుదలతో ఉన్న” అని ఆయన తెలిపారు. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశమని.. అందుకే డ్రగ్స్, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించామని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగానూ తాను ప్రాధాన్యం ఇస్తున్నానని ఆయన వెల్లడించారు.
రైతులకు అండగా ఉంటున్నం
రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి ఇచ్చిన మాట ప్రకారం రూ.7,500 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని సీఎం తెలిపారు. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇచ్చామన్నా రు. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచామని.. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నామ ని చెప్పారు. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తు న్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర, నాణ్యమై న విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ధరణి పోర్టల్పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని, ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి యాదికి రావాలి
తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే.. మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే.. తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి.. కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా త్వరలో తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.
- సీఎం రేవంత్రెడ్డి