దేశ రక్షణ విషయంలో రాజీపడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ రక్షణ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందన్నారు . దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో ముందడుగన్నారు. డిఫెన్స్ సంస్థలకు వ్యూహాత్మకంగా హైదరాబాద్ సిటీ సేఫ్ ప్లేస్ అన్నారు. దామగుండంపై చాలా మంది వివాదాలు చేయాలని చూశారన్నారు . దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదన్నారు. తమిళనాడులో34 ఏళ్లుగా రాడార్ స్టేసన్ ఉన్నా ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు రేవంత్.
దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామన్నారు రేవంత్. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయం.. కలిసి నడుస్తామన్నారు. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు ఆలోచించాలన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణంలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు రేవంత్. దేశభద్రత చాలా ముఖ్యమని.. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని విమర్శించారు రేవంత్.
వికారాబాద్ జిల్లా దామగుం డం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడర్ స్టేషన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్రమంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.