1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి .. టూరిజం హబ్ గా హైదరాబాద్

1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి .. టూరిజం హబ్ గా హైదరాబాద్

 

  •  ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం చేస్తం
  • గోపన్ పల్లిలో ఎకరం రూ.వంద కోట్లు
  •  ఐటీ ఫార్మా సంస్థలతోనే భూముల ధర పెరిగింది
  •  ఇక్కడికి ఎవరొచ్చినా అక్కున చేర్చుకుంటం
  • జంటనగరాల అభివృద్ది కోసమే హైడ్రా వ్యవస్థ
  • గోపన్  పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం 

హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇవాళ గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ ఎడ్డి ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లై ఓవర్ పైకి ఉమెన్ బైకర్ ను  అనుమతించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

మూసీ అంటే ముక్కు మూసుకొనే పరిస్థితి ఉందని, వచ్చే ఐదేండ్లలో ప్రపంచ స్థాయి పర్యాటకులు వచ్చి దర్శించుకునేలా చేస్తామని చెప్పారు. ఇందుకోసం మూసీ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకున్నానని అన్నారు. వచ్చే ఐదేండ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని లండన్ లోని థేమ్స్ రివర్ లా అభివృద్ది చేయబోతున్నామని చెప్పారు. మూసీ అభివృద్ధిని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తుకు వచ్చేలా అభివృద్ది చేస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కోరారు. 

తెలంగాణకు వచ్చే ఆదాయంలో 65 శాతం జంటనగరాలదేనని అన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగం అభివృద్ది వల్ల ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగాయన్నారు. గోపన్ పల్లిలో ఎకరం వంద కోట్ల రూపాయలు పలుకుతోందని చెప్పారు. హైదరాబాద్  కు ఎవరొచ్చిన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.