బీసీల లెక్కలు తీసి లాకర్ల దాసుకోలె .. బిల్లు పాస్ చేసినం.. ఇది మా చిత్తశుద్ధి: సీఎం రేవంత్

బీసీల లెక్కలు తీసి లాకర్ల దాసుకోలె .. బిల్లు  పాస్ చేసినం.. ఇది మా చిత్తశుద్ధి: సీఎం రేవంత్
  • దుర్బుద్ధి ఉన్నోళ్లు ఈ సర్వేలో పాల్గొనలేదు
  • ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కులగణన
  • 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు.. లెక్కలడిగింది
  • మేం 8 పేజీలు సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ రెడీ చేసినం
  • 22 న ఢిల్లీ  బీసీ సంఘాలు మీటింగ్ కి రాహుల్ వచ్చేలా ప్రయత్నం చేస్తా
  • హైదరాబాద్ నుండి ఒక రైల్ ఏర్పాటు చేద్దాం
  • ఆ బాధ్యత  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చూస్తరు
  •  రాహుల్ గాంధీ కి అభినందన సభ పెట్టండి 
  •  బీసీ సంఘాల నేతలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కులగణన చేపట్టి బీసీల లెక్కలు తీసి గత ప్రభుత్వం మాదిరిగా తాము లాకర్లో దాచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాలులో బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ తాము చాలా పకడ్బందీగా కులగణన సర్వే చేపట్టామని అన్నారు.  కొంత మంది దుర్బద్ధి ఉన్నోళ్లు సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ  ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కులగణన నిర్వహించి..  రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారని, దానిని అమలు చేస్తామని అన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ల పెంపు కుదరదని సుప్రీంకోర్టు చెప్పలేదని సీఎం అన్నారు. కులగణనలో తీసిన లెక్కలను అడిగిందని అన్నారు. ఇందుకోసం తాము 8 పేజీల సెల్ఫ్ డిక్లరేషన్ సిద్ధం చేశామని చెప్పారు. 

బీసీ వర్గాలు ఓట్లు వేయడం వల్లే తాము అధికారంలోకి వచ్చామని వివరించారు.  కుల గణన చేసి పూర్తి చేసిన ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టీస్ డే గా ప్రకటించామని సీఎం తెలిపారు.  బీసీ కులగణనపై ఏర్పాటు  చేసిన కేబినెట్  సబ్ కమిటీకి సీనియర్ మంత్రైన ఉత్తమ్ రెడ్డి చైర్మన్ గా, మంత్రి పొన్నమ్ మెంబర్ గా నియమించామని చెప్పారు. అధికారులతో పనిచేయించే నేత కావాలనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ గా నియమించినట్టు చెప్పారు. డెడికేషన్ కమిషన్ వద్దని అధికారులు చెబితే తాను ఒప్పుకోలేదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన బూసాని వెంకటేశ్వరరావును చైర్మన్ గా నియమించినట్టు చెప్పారు.  

ALSO READ | 39 వేల కోట్లు గోదాట్లో కలిపారు..సమాధానం చెప్పాల్సి వస్తదనే అసెంబ్లీకి వస్తలేరు: పొంగులేటి

ఈ నెల 22న ఢిల్లీలో జరిగే బీసీ సంఘాల మీటింగ్ కు రాహుల్ గాంధీ వచ్చేలా ప్రయత్నం చేస్తానని సీఎం చెప్పారు. హైదరాబాద్  నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఒక రైలు ఏర్పాటు చేద్దామని, ఆ బాధ్యతను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చూస్తారని అన్నారు.  రిజర్వేషన్లు పెంపు, జనగణన లో కుల గణన చేయాలని ప్రధాన డిమాండ్ పెట్టాలని అన్నారు. మనం ఒత్తిడి చేయకుంటే బీజేపీ సర్కారు కులగణన చేపట్టబోదని అన్నారు.   బీసీ కులగణను కార్యాచరణలో పెట్టేలా చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి అభినందన సభ ఏర్పాటు చేయాలని కోరారు. అది సూర్యాపేటనా.? పరేడ్ గ్రౌండా అనేది డిసైడ్ చేయాలని బీసీ సంఘాల నేతలకు చెప్పారు. 

29 రాష్ట్రాల బీసీ సంఘాల మద్దతు ఉంటది: జాజుల

బీసీ కులగణన చేసిన ముఖ్యమంత్రికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు లెలిపారు. గత సీఎం బీసీలకు ఎన్నో ఇస్తామని ఇవ్వలేదన్నారు. బీసీకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. బీసీ ప్రధాని ఈ రిజర్వేషన్లను చట్టం చేస్తారా..? లేదా..? చూద్దామన్నారు. ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే పోరాటానికి 29 రాష్ట్రాల బీసీ సంఘాల మద్దతు ఉంటుందని చెప్పారు.  

బీసీలకు బడ్జెట్  పెంచాలి: చిరంజీవులు

రిజర్వేషన్లు ఎప్పుడైనా కాంగ్రెస్ టైంలోనే వచ్చాయని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీసీ సమాజం రుణపడి ఉంటుందని చెప్పారు. కేంద్రంతో 9వ షెడ్యూల్ లో  రిజర్వేషన్ల పెంపు అంశం చేర్చితే కోర్టుల్లో వివాదాలు  రాకుంటుండా ఉంటుందని అన్నారు.