ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్

ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
  • నది పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను
  • టూరిస్టు ప్లేసులుగా మారుస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నం 
  • అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నది పరివాహక ప్రాంతంలోని చారిత్రాక భవనాలను టూరిస్టు ప్లేసులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామ‌‌‌‌ని సీఎం తెలిపారు. హైదరాబాద్​లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు.

 ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేయ‌‌‌‌నున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్ కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయ‌‌‌‌ప‌‌‌‌డ్డారు. జూబ్లీహాల్ ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐ కి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసర‌‌‌‌ముందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతున్నదని చెప్పారు.

పురాతన మెట్ల బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు

నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేర‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్లబావి పునరుద్ధరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావుల‌‌‌‌ను బాగుచేయనుంది. అడిక్‌‌‌‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నది. కార్యక్రమంలో రాష్ట్ర ప‌‌‌‌ర్యాట‌‌‌‌క శాఖ మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్, సీఎం ప్రత్యేక కార్యద‌‌‌‌ర్శి అజిత్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు  పాల్గొన్నారు.