
- ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలి: సీఎం రేవంత్
- ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి
- అవసరమైన నిధులు వెంటనే అందిస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఉండాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐటీఐలన్నింటిని ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కార్మిక శాఖపై హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ చేశారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకు అవసరమైన సిబ్బంది, ఇతర వివరాలను సీఎంకు అధికారులకు వివరించారు. సిబ్బంది నియామకంపై సీఎం రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యాక్ట్ పై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని చెప్పారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్పాల్గొన్నారు.
25 ఏటీసీల్లో క్లాస్లు షురూ
ఆధునిక టెక్నాలజీలపై యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరుడు 65 ఏటీసీలు మంజూరు చేయగా.. దాదాపు-60 భవనాల నిర్మాణం పూర్తయింది. ఒక్కో ఏటీసీకి రూ.35 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత 25 ఏటీసీల్లో క్లాస్లు మొదలుపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 అసెంబ్లీ నియోజకర్గాల్లో ప్రతి సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్(మెకానికల్), అడ్వాన్స్డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్, ఆర్టీషియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, మాన్యుఫ్యాక్చర్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ కోర్సులు ఏటీసీల్లో ఉన్నాయి.