
- హుజూర్నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- 30 వేల మందితో భారీ బహిరంగ సభ
- దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ
నల్గొండ, వెలుగు: దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ స్కీమ్ను ఉగాది సందర్భంగా ఆదివారం ప్రారంభించనుంది. హుజూర్నగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు.
ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నొడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన సర్కార్.. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది.కాగా, పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించేందుకు కిలోకు రూ.40 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
సభకు ఏర్పాట్లు పూర్తి..
హుజూర్నగర్ పట్టణంలో 30 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగానే సన్నబియ్యం స్కీమ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆరుగురు ఏఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలతో పాటు రోప్ పార్టీ, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సెక్టార్ అధికారులు, కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు. అలాగే సభ నేపథ్యంలో మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేట్ బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. కాగా, సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే ప్రాంతాలు, సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రదేశాలను ఎస్పీ నరసింహ శనివారం పరిశీలించారు.
ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్..
- ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
- సాయంత్రం 5:45 గంటలకు హుజూర్నగర్లోని రామస్వామి గట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2,160 ఇండ్లను పరిశీలిస్తారు.
- 6.15 గంటలకు హుజూర్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడ సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 6:15 గంటల నుంచి 7:30 గంటల వరకు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం 7:30 గంటలకు హుజూర్నగర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9:45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.