
- మరిన్ని కొత్త కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయండి
హైదరాబాద్, వెలుగు: రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఫండ్ (ఆర్ఐడీఎఫ్) కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కో ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలన్నారు. మరిన్ని కొత్త కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో శుక్రవారం నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు పలు సూచనలు చేశారు.
‘‘స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపుల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించండి. ఐకేపీ, గోదాములు, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించండి. మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వండి’’అని రేవంత్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్ నిధులను మార్చి 31లోపు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని సీఎంకు నాబార్డు చైర్మన్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.