కుల గణన ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి

కుల గణన ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దేశ చరిత్రలోనే.. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని.. దేశానికే ఇది రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు ఇస్తాం అని.. అధికారికంగా కులగణన అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్ దే అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన.

దేశంలోనే మొదటి సారి కుల గణన చేసి చరిత్ర సృష్టించామని.. పకడ్బందీగా సర్వే నిర్వహించి వివరాలు సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2025, ఫిబ్రవరి 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి విలేఖర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో విజయవంతంగా కుల గణన కంప్లీట్ చేయడంతో.. ఇక దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ప్రధాని మోడీపైన ఒత్తిడి పెరుగుతోందన్నారు. 

అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలనే డిమాండ్ మరింత ఎక్కువ అవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కుల గణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచి రోడ్ మ్యాప్ ఇస్తున్నామని.. భవిష్యత్‎లో తెలంగాణ డాక్యుమెంట్స్‎ను రెఫరెన్స్‎గా తీసుకోవాలని పేర్కొన్నారు. 

Also Read :- స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు రెడీ

2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే కుల గణన చేపట్టిందన్నారు. 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు. కుల గణన రిపోర్టు, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్, అసెంబ్లీలో ఆమోద ముద్ర పడటంతో.. ఈ రోజు (ఫిబ్రవరి 4) దేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కాపీ చట్టం కాలేదని.. అసలు సర్వే ఎవరు చేశారో ఎందుకు చేశారో ఎవ్వరికీ చెప్పలేదన్నారు. ప్రభుత్వ అధికారికంగా సర్వే చేస్తే.. ఆ వివరాలు బయటపెట్టాలన్నారు. దేశ చరిత్రలో మేము చేసింది అధికారిక సర్వే అని అన్నారు.  కులగణన నివేదికకు క్యాబినెట్ఆమోదం తెలిపిందని.. ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. కుల గణనపై ప్రభుత్వం సభలో ప్రకటన చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కుల గణన నివేదికపై చర్చ‎కు స్పీకర్ అవకాశం ఇస్తే సభలో చర్చ జరుగుతుందన్నారు.