![ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddys-key-decision-curb-sand-smuggling_V6z5JYy0Fj.jpg)
హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం (ఫిబ్రవరి 10) గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణా కట్టడికి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం.
అలాగే.. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.
ఆ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని చెబుతూ.. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని పేర్కొన్నారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణలో పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని.. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందుకు జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలన్నారు.
అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేసి.. ప్రతి రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలని.. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాంతాల వారిగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఏర్పడాలని పేర్కొన్నారు.
సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం జరగాలని.. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు జరగాలని.. ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.