
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- ఇందిరమ్మ కమిటీలు తయారుచేసిన లిస్టును మండలాధికారులు తనిఖీ చేయాలి
- అనర్హులు లబ్ధిపొందితే వారి నుంచి సొమ్ము వసూలు చేయాలి
- భూభారతి సందేహాల నివృత్తికి పైలెట్ ప్రాజెక్టు కింద మూడు మండలాల్లో సదస్సులు
- ఎప్పటికప్పుడు పోర్టల్అప్డేట్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: గ్రామస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని, అర్హులనే ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలన్నారు. అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే వెంటనే ఆ విషయాన్ని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి, ఆ స్థానంలో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లపై తన నివాసంలో సీఎం శనివారం సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుకు.. ఆ వ్యక్తి సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. లబ్ధిదారుకు ఆర్థిక ఊరట లభించేందుకు సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలన్నారు. సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.
భూ భారతి సులభంగా వేగంగా..
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను అధికారులకు సీఎం సూచించారు. భూ భారతి ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. తర్వాత రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్ పాల్గొన్నారు.