మూసీ సుందరీకరణ కాదు.. పునర్జీవనం.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ సుందరీకరణ కాదు.. పునర్జీవనం.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తోన్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. వారికి మెరుగైన జీవనం అందించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన, పునర్జీవనంపై 2024, అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే మూసీ ప్రాజెక్ట్ పునర్జీవన కార్యక్రమం చేపట్టామని అన్నారు. 10 నెలలుగా నిద్రాహారాలు మాని అధికారులు మూసీపై పని చేశారని.. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయని తెలిపారు.

మూసీలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారని... వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‎ను తీర్చదిద్దడానికి ప్రయత్నంచేస్తున్నామన్న సీఎం.. మూసీ పునర్జీవనాన్ని అడ్డుకోవడానికి కొంత మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన వాళ్లు ఇలా ప్రతీది అడ్డుకోవాలని చూస్తారని బీఆర్ఎస్‎పై నిప్పులు చెరిగారు. 

బందిపోటు దొంగల్లా.. రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకున్నారు.. అధికారులు, మంత్రుల మసుగులో రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటు దొంగలు వాళ్లు అని విమర్శించారు. మూసీ కంటే మురికి బీఆర్ఎస్ నేతల మెదల్లోనే ఉందని అన్నారు. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని దేశంలో మరొకటి లేదు.. అలాంటి మూసీ నదిని గత పాలకులు మురికి కూపంలోకి నెట్టారని బీఆర్ఎస్‎పై ధ్వజమెత్తారు. మేం చేసేది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ నది పునర్జీవనమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

మూసీ బ్యూటిఫికేషన్ అంటూ అసత్య ప్రచారాలు చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ బెడ్‎లో దాదాపు 1600 ఇండ్లు ఉన్నాయని.. ఇప్పటికే అధికారులు వాళ్లతో మాట్లాడారని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం కక్కతున్నారని మండిపడ్డారు. చిన్న వయస్సులోనే నాకు అన్ని వచ్చాయని.. నాకు ఇంకా ఏం అవసరం లేదన్న సీఎం.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టామని క్లారిటీ ఇచ్చారు.