తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జైకా కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జైకా కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్: జపాన్‎లో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ వివిధ పేరుమోసిన కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతోంది. ఇందులో భాగంగానే గురువారం (ఏప్రిల్ 17) జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్‎తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని జైకాను కోరింది. 
పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జైకా ప్రతినిధులకు వివరించారు. 

►ALSO READ | బ్రేకింగ్: గ్రూప్-1 సెలక్షన్ పక్రియకు బ్రేక్.. నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు ఆర్డర్

కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని జైకా బృందానికి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం.. అంటే రూ.11,693 కోట్లు రుణం అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పారు. మెట్రోతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు, కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని రిక్వెస్ట్ చేశారు.

హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తన ఆలోచనలను సీఎం వారితో పంచుకున్నారు. జైకాకు, తెలంగాణతో ఏళ్లకేళ్లుగా సంబంధాలున్నాయని జైకా  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.